బెంగాల్‌లో బీజేపీ గెలుపు.. పాలనలో తొలి కీలక బదిలీ!

  • బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత తొలి అడ్మినిస్ట్రేటివ్ మార్పు
  • గవర్నర్ ఆర్.ఎన్. రవికి కొత్త కార్యదర్శిగా సౌమిత్రా మోహన్
  • దాదాపు మూడేళ్ల తర్వాత ఈ పదవిలో ఐఏఎస్ అధికారి నియామకం
  • రవాణా శాఖ కార్యదర్శిగా ఉన్న సౌమిత్రా మోహన్‌కు కొత్త బాధ్యతలు
  • గతంలో నందినీ చక్రవర్తిని తొలగించిన తర్వాత ఈ పోస్ట్ ఖాళీగా ఉన్న వైనం
పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఓడించి బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే, రాష్ట్ర పాలనా యంత్రాంగంలో తొలి కీలక బదిలీ జరిగింది. గవర్నర్ ఆర్.ఎన్. రవికి కొత్త కార్యదర్శిగా సౌమిత్రా మోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఇవాళ‌ ఉత్తర్వులు జారీ చేసింది.

2002 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి అయిన సౌమిత్రా మోహన్, గత మూడేళ్లకు పైగా రాష్ట్ర రవాణా శాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పరిపాలనా పరంగా అనేక మార్పులు జరిగినప్పటికీ, ఆయన్ను రవాణా శాఖ నుంచి తప్పించలేదు. అయితే, సోమవారం ఎన్నికల ప్రక్రియ ముగిసిన వెంటనే, ఆయన్ను గవర్నర్ కార్యదర్శిగా బదిలీ చేశారు.

గవర్నర్ ఆర్.ఎన్. రవి మార్చి 12న కోల్‌కతాలోని లోక్‌ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. తాను బాధ్యతలు చేపట్టిన వారంలోపే తనకు ఒక కార్యదర్శిని నియమించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో ఈ నియామకం పూర్తి కాలేదు.

గతంలో సీవీ ఆనంద్ బోస్ గవర్నర్‌గా ఉన్నప్పుడు ఐఏఎస్ అధికారిణి నందినీ చక్రవర్తి ఆయనకు కార్యదర్శిగా ఉండేవారు. కానీ, ఆమెను ఆ పదవి నుంచి కొన్ని రోజులకే తొలగించారు. ఆ సమయంలో ఆమె నాటి అధికార పార్టీకి చెందిన వ్యక్తిగా ముద్రపడటమే దీనికి కారణమని లోక్ భవన్ వర్గాలు తెలిపాయి. ఫిబ్రవరి 2023లో ఆమెను తొలగించిన తర్వాత దాదాపు మూడేళ్ల పాటు ఈ పదవిలో ఏ ఐఏఎస్ అధికారిని నియమించలేదు. చాలా కాలం తర్వాత మళ్లీ ఈ పదవిలో ఒక ఐఏఎస్ అధికారి నియమితులయ్యారు.

ఇదిలా ఉంటే.. గవర్నర్ ఆర్.ఎన్. రవి మంగళవారం తన భార్య లక్ష్మీ రవితో కలిసి కాళీఘాట్‌లోని కాళీమాత ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. పశ్చిమ బెంగాల్ ప్రజల శ్రేయస్సు, రాష్ట్ర పురోగతి కోసం ప్రార్థించినట్లు వారు తెలిపారు.

Governor RN Ravi
Soumitra Mohan
West Bengal
IAS officer
Bureaucracy reshuffle
Kolkata
Trinamool Congress
BJP
Nandini Chakravarti
Kali Temple

More Telugu News